విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసి మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను నిర్మిస్తోంది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించి.. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఇఎల్)కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా మారనుందిఈ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన 5 బొగ్గు ఆధారిత బాయిలర్ల పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో శరవేగంగా కొనసాగుతున్నాయి.
విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్పాండ్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి నీటిని తరలిస్తారు. ఇందుకోసం చేపట్టిన 22 కిలోమీటర్ల మేర పైపులైన్, రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. అక్టోబర్ నాటికి రెండు యూనిట్ల పనులు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు సిద్దం చేశారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించిన పనులు 70 శాతానికి పైగా పూర్తి చేశారు. YTPSకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ముంబయికి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్, విశాఖకు చెందిన సమత అనే స్వచ్ఛంద సంస్థలు కేసు వేశాయి. దీంతో ఎన్జీటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతిని నిరాకరించింది. కేవలం సివిల్ పనులు కొనసాగించడానికి అనుమతించింది.
యాదాద్రి ప్లాంటు నిర్మాణంపై విచారణ జరిపిన ఎన్జీటీ.. ప్లాంట్ వల్ల ఆ ప్రాంతంలో ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలు దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు టీఓఆర్ జారీ చేయాలని గత అక్టోబర్ లో కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు టీఓఆర్ జారీ చేయలేదు.34 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా వెచ్చించామని జెన్కో అధికారులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతుల కోసం టిఓఆర్ ను జారీ చేయాలని ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు 5 లేఖలు రాశామని జెన్కో అధికారులు చెబుతున్నారు. ప్లాంట్ రెండవ దశ పర్యావరణ అనుమతి కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను మరోసారి ఆశ్రయించాలని జెన్కో నిర్ణయించింది.టిఓఆర్ జారీపై కేంద్ర పర్యావరణ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం మండి పడుతోంది. రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముక లాంటి యాదాద్రి విద్యుత్ కేంద్రానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీ చేయకుండా జాప్యం చేస్తే.. తెలంగాణకే కాదు మొత్తం దేశానికి నష్టమని విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అన్ని చట్టాలకు లోబడి ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.