భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు సత్యనారాయణ అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ను సత్యనారాయణ (చిన్ని) కలిశారు. ఈ సందర్భంగా కొనేరు చిన్నిని బీఆర్ఎస్లోకి పార్టీ అధినేత ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చిన్న నేడు రాజీనామా చేయనున్నారు. అనంతరం కారెక్కనున్నారు.మూడు నెలల ముందే ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నది. పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు దక్కడంతో సీఎం కేసీఆర్ నమ్మకానికి పెద్దపీట వేసినైట్లెందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేశారు. అలాగే ఎమ్మెల్యేలుగా వివిధ పార్టీల నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆరుగురు శాసన సభ్యులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ టికెట్లు ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంతో జిల్లాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అయోమయం నెలకొంది.ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్న కాంగ్రెస్ పార్టీ శిబిరంలో నిరాశ నిస్పృహలు అలుముకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయ ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేసేలా.. సొంత పార్టీ శ్రేణులకు రాజకీయ ఊతమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక ఉండడంతో పార్టీలు పార్టీ అధినేత కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్కు ప్రత్యర్థి రాజకీయ వర్గాలకు దిమ్మతిరిగేలా ఉందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కాగా, జిల్లాలోని అన్ని స్థానాలను సొంతం చేసుకునేలా పార్టీ అధినేత వ్యూహం రచించారు. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ బలం పెంచుకుంటున్నారు.