- మైనార్టీ ఓట్ల కోసం బిఆర్ఎస్ నాటకాలు
- బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కార్యాలయం పై ఎంఐఎం కవ్వింపు చర్యలపై బిజెపి శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ ఆధ్వర్యంలో ఎం ఐ ఎం దిష్టిబొమ్మ దానం చేశారు. కరీంనగర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జోన్ బిజెపి శ్రేణులతో కలిసి తెలంగాణ చౌక్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ని ఎం ఐ ఎం, బి ఆర్ ఎస్ ల అరాచకాల తీరుపై మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసన , ఆందోళన కార్యక్రమాలను ఉద్దేశించి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు. మజ్లీస్ అరాచకా లు, రెచ్చగొట్టే కార్యక్రమాలలో బిఆర్ఎస్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
నిజాం ఆలోచన విధానాలతో రాజ్యమేలుతున్న నయా నిజాం కేసీఆర్ అండదండలతో రాబోయే ఎన్నికల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని, కరీంనగర్ లో ఎంఐఎం అరాచకాలు మంత్రి గంగుల కమలాకర్ కనుసనల్లోనే జరిగినట్లు అర్థమవుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంఐఎం ఇలాగే గొడవలు సృష్టించి గంగుల కమలాకర్ కు మైనార్టీ ఓట్లతో లబ్ధి చేకూరిన తీరును ప్రజలంతా గమనించాలన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో విజయం తర్వాత ఎంఐఎం జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, రాళ్లు రువ్విన ఘటన ఇంకా ఎవరు మర్చిపోలేదన్నారు. మంత్రి గత కొద్ది రోజుల క్రితం ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ తో కరీంనగర్ ఎంఐఎం నేతలతో సమావేశమై ఏం చర్చలు జరిపారో ప్రజలకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఇంటిపై , కార్యాలయం పై దాడులకు రూపకల్పన కోసం ఏమైనా చర్చలు జరిపారా అన్న అనుమానం ఉందన్నారు.
శుక్రవారం మిలాద్ ఉన్ నబి సందర్భంగా ఎంఐఎం నేతలు ఏర్పాటు చేసిన ర్యాలీని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారని , అనంతరం ర్యాలీ రూటును బండి సంజయ్ ఇంటి వద్దకు మళ్లించి , కవ్వింపు చర్యలు, అలజడులు సృష్టించే ప్రయత్నం చేశారరన్నారు. ర్యాలీ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం, ఇంటి వైపుకు వెళ్లడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎంపీ కార్యాలయం, ఇంటిపై నే దాడులకు ప్రణాళిక రచిస్తే పోలీస్, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన ఎంఐ ఎం నేతలు, కార్యకర్తలు, ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్న బి ఆర్ఎస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,మాడ వెంకటరెడ్డి, నాయకులు బాస సత్యనారాయణ రావు, సాయిని మల్లేశం, గడ్డం నాగరాజు, రాపర్తి ప్రసాద్, బొంతల కళ్యాణ్, కటకం లోకేష్, ఊగిలే సుధాకర్ పటేల్,సిద్ది సంపత్,ఎడమ సత్యనారాయణ రెడ్డి, పుప్పాల రఘు, దూలం కళ్యాణ్, బండారి గాయత్రి,బల్బీర్ సింగ్, లడ్డు ముందడ,వరాల జ్యోతి, మామిడి చైతన్య, రచ్చ శ్రీనివాస్, ఊరడి శివారెడ్డి, తూర్పాటి రాజు, ఉప్పరపల్లి శీను, శ్రీ రాముల శ్రీ కాంత్,ఇసపెల్లి మహేష్, సంపత్ తణుకు సాయి తదితరులు పాల్గొన్నారు.