A place where you need to follow for what happening in world cup

కోర్టులో కన్నీరు పెట్టిన స్వాతి మలీవాల్

  • మూర్ఛపోయిన మహిళా కానిస్టేబుల్
  • ఎంపీపై వేధింపుల కేసు విచారణలో నాటకీయ పరిణామాలు
  • నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో బిభవ్ ను కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు

రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలీవాల్ పై వేధింపులు, దాడి కేసును సోమవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో సోమవారం బిభవ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

విచారణ జరుగుతుండగా ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహ కోల్పోవడంతో కోర్టులో కలకలం రేగింది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రతకు కానిస్టేబుల్ స్పృహ కోల్పోయినట్లు సమాచారం. కానిస్టేబుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించిన తర్వాత కోర్టులో విచారణ కొనసాగింది. కాసేపటికి ఈ కేసులో బాధితురాలు ఎంపీ స్వాతి మలీవాల్ కన్నీరు పెట్టారు. విచారణ జరుగుతుండగా భావోద్వేగానికి గురైన ఎంపీ.. కన్నీటిని ఆపుకోలేకపోయారు.

ఈ నెల 18న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందని ఎంపీ స్వాతి మలీవాల్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనపై విచక్షణరహితంగా దాడి చేశారని, చెంపపై ఏడు ఎనిమిదిసార్లు కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కడుపులో తన్నడంతో పాటు సున్నిత భాగాలపైనా కొట్టాడని చెప్పారు. దీంతో పోలీసులు ఈ నెల 18న బిభవ్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

కోర్టు ఆయనకు నాలుగు రోజుల కస్టడీ విధించింది. కాగా, ఈ ఘటనపై స్వాతి మలీవాల్ మాట్లాడుతూ.. తనపై ఇలా దాడి జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. మహిళా కమిషన్ లో విధులు నిర్వహించినపుడు బాధిత మహిళలకు ఏదేమైనా సరే న్యాయం కోసం పట్టువదలకుండా పోరాడాలని సలహా ఇచ్చేదానిని అని గుర్తుచేసుకున్నారు. తనపై దాడి విషయంలోనూ ఇదే పాటిస్తున్నానని, తన కెరీర్, పదవి ఏమైపోయినా పట్టించుకోబోనని తేల్చిచెప్పారు.

Leave A Reply

Your email address will not be published.