- ఒక్క కేటాయింపు కూడా లేకపోవడం దారుణం
- స్వీయ అస్తిత్వమే మనకు శ్రీరామరక్ష అన్న బిఆర్ఎస్ నేత కెటిఆర్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి గుండు సున్నానే దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో కేం మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కెటిఆర్ స్పందిస్తూ…తెలుగు కోడలు అయి ఉండి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈసారి కూడా ఏమైనా భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యమని అన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. రూ. 48 లక్షలు ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హావిూల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని అన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ..కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదని కేటీఆర్ తెలిపారు.
ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని తాము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదని, తెలంగాణ నుంచి ముంబై` నాగపూర్, బెంగళూరు` చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని, మెగా పవర్ లూమ్ క్లస్టర్తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి దిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదని, తెలంగాణకు మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నానేనని, 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కు, బీహార్కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందని, ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బడ్జెట్ తెలియ జేస్తుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని, ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని, 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. ఆంధప్రదేశ్కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు తమకేం బాధ లేదని, సోదర రాష్ట్రంగా వారికి వొచ్చిన కేటాయింపులపైన, వారు బాగుండాలని కోరుకుంటున్నామని, అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ ఆనే పదం ప్రస్తావించలేదని అన్నారు.
రాజధాని అమరావతి కోసం, పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారని, ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారని, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన భారీ నిధుల పట్ల మాకు ఎలాంటి దుగ్ధలేదు..సంతోషమే. కానీ ఆంధప్రదేశ్, బీహార్కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన వారు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.