బోడుప్పల్ కార్పొరేషన్ కమిషనర్ రామలింగం బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: కొత్తగా ఇల్లు నిర్మించే యజమానులు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు తవ్వించాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు భూగర్భ జలాలను పెంపొందించుకోడానికి వీలుగా ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరని ఆయన తెలిపారు. ఇప్పటికే నూతన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాల యజమానులు కూడా తప్పనిసరిగా ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.
సొంత ఇంటిలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెంపొంది, భావి తరాలకు నీటి ఎద్దడి రాకుండా చేయడానికి వీలవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రంగా వున్నందున మన బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో నీటి సమస్య రాకుండా చేయడానికి వీలుగా ముందస్తుగా ఇంకుడు గుంతలు సహాయపడతాయని తెలిపారు. ప్రతి ఇంటి యజమాని ఇంకుడు గుంతల నిర్మాణం బాధ్యతగా గుర్తించి వాటి నిర్మాణం చేపట్టాలని కమిషనర్ సూచించారు. వీటి ఆవశ్యకత తెలియని వారికి ఇంకుడు గుంతల నిర్మాణం ప్రాధాన్యం వివరించాలని కమిషనర్ రామలింగం తెలిపారు.