వోటేసిన సిఎం రేవంత్..ఎమ్మెల్యే బండ్ల
99.86 శాతం వోటింగ్ నమోదు
2న కౌంటిగ్..అదేరోజు ఫలితం వెల్లడి
మహబుబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ పక్రియ పూర్తయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం వోటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూలు, నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే వోటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం వోటింగ్ నమోదైంది.కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో వోటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఆయన వోటు వేశారు.
స్థానిక సంస్థల కోటా ఎన్నికలో మొత్తం 1439 మందికి వోటు హక్కు ఉంది.
ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలక కౌన్సిలర్లు వోటు హక్కును వినియోగించుకున్నారు. 1439 మంది వోటర్లలో 900 మంది గతంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే. కానీ.. వీరిలో చాలా మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇంకొందరు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు క్రాస్ వోటింగ్ జరుగుతుందని అంచనా వేశారు. 1439 మంది వోటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ పక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. వోటర్లను రెండు ప్రధాన పార్టీలు క్యాంపులకు తీసుకెళ్లాయి. ఇతర పార్టీలు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బీఆర్స్ క్యాంపులకు వెళ్లిన వాళ్లు కూడా పెద్దగా లేరని అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే విజయంపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది.
అధికార కాంగ్రెస్ నుంచి.. టిటిడి బోర్డు మాజీ మెంబర్ జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపన పడుతుండగా.. అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి. ఏప్రిల్ 2న ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. పూర్తి స్తాయిలో బలం ఉన్నా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లవుతుంది. ఉపఎన్నికలో మహబూబ్ నగర్ శాసన మండలి స్థానానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వోటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు దాదాపు 60 శాతం మంది తమ వోటును వినియోగించుకున్నారు. పదవీరీత్యా కొడంగల్ ఎంఎల్ఏగా ముఖ్యమంత్రి ఎం. రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఆయన స్వంత నియోజకవర్గం కూడా.
ఎంఎల్సి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక చోటుచేసుకుంది.
ఆయన ఇదివరలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వోట్ల లెక్కింపు ఏప్రిల్ 2న జరుగనున్నది. ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఓటు హక్కును జడ్ పి కార్యాలయం సమావేశం మందిరంలో వినియోగించుకున్నారు. గద్వాల జిల్లా పోలింగ్ కేంద్రంలో ఆయన తన వోటును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే వెంటనే ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కేశవ్, జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.