A place where you need to follow for what happening in world cup

ఆమె సాహసం చేయకుంటే యువతి కూడా ప్రాణాలు కోల్పోయేదే!

  • ఎల్బీనగర్‌లో ప్రేమోన్మాది దాడిలో యువతి సోదరుడి మృతి
  • నిందితుడిని హెచ్చరిస్తూ పోలీసులకు సమాచారం అందించిన పొరుగింటి ఝాన్సీ
  • కర్రతో తలుపులు బాదుతూ హెచ్చరించడంతో బాధితురాలిని వదిలేసిన నిందితుడు

హైదరాబాద్ శివారులోని ఎల్బీనగర్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రేమోన్మాది దాడి కేసులో ఓ మహిళ చేసిన సాహసమే యువతి ప్రాణాలు కాపాడింది. ఆమె పొరుగింట్లో ఉండే ఝాన్సీ చాకచక్యంగా వ్యవహరించడంతో బాధితురాలి ప్రాణాలు నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. తనను దూరం పెడుతోందన్న ఆగ్రహంతో యువతి ఇంటికి చేరుకున్న నిందితుడు శివకుమార్.. బాధితురాలు సంఘవితో వాగ్వివాదానికి దిగాడు. ఆపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడి ఛాతీపై పొడవడంతో సంఘవి భయంతో పెద్దగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని వచ్చిన పొరిగింటి ఝాన్సీకి రక్తస్రావంతో బయటకు పరిగెడుతున్న పృథ్వీని చూసి ఏం జరిగిందని ప్రశ్నించింది.

ఇంట్లో అక్క ఉందని చెబుతూ కిందపడి స్పృహ కోల్పోయాడు. దీంతో కర్రపట్టుకుని సంఘవి ఇంటికి వెళ్లిన ఆమె.. నిందితుడిని చూసింది. యువతి మరో గదిలో దాక్కుంది. వెంటనే అప్రమత్తమైన ఝాన్సీ కర్రతో తలుపులు బాదుతూ నిందితుడిని హెచ్చరిస్తూనే స్థానిక యువకులకు, పోలీసులకు సమాచారం అందించింది. వారందరూ అక్కడికి చేరుకుని గది తలుపులు, కిటికీలు తొలగించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు, అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అలా, ఝాన్సీ ధైర్యసాహసాలు సంఘవి ప్రాణాలు నిలిపాయి. మరోవైపు, నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె సోదరుడు పృథ్వీ మృతి చెందాడు.

Leave A Reply

Your email address will not be published.