హైదరాబాద్:13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవన్ దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హజరయ్యారు. . ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్సీ ప్రభాకర్, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేడు ఢిల్లీలో జరిగే జాతీయ అవయవదాన కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందకుంటుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు.
కేసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల, కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల ఇది సాధ్యం అయ్యింది. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం గొప్ప విషయం. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను. రియల్ హీరోస్ గా మారిన 105 కుటుంబాలను నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్బంగా ఈరోజు సన్మానించుకోవడం సంతోషంగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఎంతో మంది పునర్జన్మ పొందారు. మీ సంబంధీకులు మీ ముందు లేకపోయినప్పటికీ, మరొకరి రూపంలో మన మధ్యలోనే ఉన్నారు. నుదిటి గీతను సైతం మార్చి, ప్రాణం నిలిపిన మీరు మరో బ్రహ్మలు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవ దానాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2022 సంవత్సంరలో తెలంగాణలో 194 మంది అవయవ దానం చేశారు. తమిళనాడు 156, కర్ణాటక 151, గుజరాత్ 148 అవయవదానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2013 జీవన్దాన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 1288 బ్రెయిన్ డెత్ డొనేషన్స్ జరిగాయి. మొత్తం 4829 ఆర్గాన్స్ సేకరించి, అవసరం ఉన్న వారికి అమర్చడం జరిగింది.
అవయవ మార్పిడి చికిత్సల విషయంలోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022లో దేశవ్యాప్తంగా 1675 ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు జరిగితే.. తెలంగాణలోనే 530 జరిగాయి. తమిళనాడు 519, కర్ణాటక 415 సర్జరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 126 ఆర్గాన్ డొనేషన్లు నమోదయ్యాయి. అయితే ఇది చాలదు. జీవన్ దాన్ లో నమోదై, అవయవాల మార్పిడి చేసుకొని జీవితాన్ని పొడిగించుకోవాలని చూస్తున్న వారి సంఖ్య సుమారు 3వేలుగా ఉంది. అవయవ మార్పిడి అనగానే ఒకప్పుడు కార్పోరేట్ ఆసుపత్రులే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ కు ధీటుగా మన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు నిమ్స్ లో 395, ఉస్మానియాలో 74, గాంధీలో 11 మొత్తం 480 ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. ఇందులో అత్యధికంగా 436 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నాయి. గత నెలలో నిమ్స్ లో ఆరోగ్య శ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. నిమ్స్ వైద్యులు ఒకే రోజు రెండుమూడు అవయవ మార్పిడులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలకు నిమ్స్ కేరాఫ్ గా మారింది. రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే విలువైన ట్రాన్స్ప్లాంట్ సర్జరీలను ప్రభుత్వం పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేరువ చేసింది. దీంతో పాటు సర్జరీ చేసుకున్న వారికి జీవిత కాలం పాటు నెలకు 10వేల నుంచి 20 వేల విలువ చేసే మందులను ఉచితంగా అందిస్తున్నదని అన్నారు.