- 16 మంది అభ్యర్థులతో మూడో జాబితా ప్రకటించిన అధిష్ఠానం
- చెన్నూరులో వివేక్, నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ పోటీ
- వనపర్తి, బోథ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన హైకమాండ్
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఆయనను ప్రకటించింది. 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది.
ఇక చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
మూడో విడత అభ్యర్థుల జాబితా ఇదే
1. చెన్నూరు – వివేక్ వెంకటస్వామి
2. కామారెడ్డి – రేవంత్ రెడ్డి
3. బాన్సువాడ – ఏనుగు రవీందర్
4. నిజామాబాద్ అర్బన్ – షబ్బీర్ అలీ
5. డోర్నకల్ – రామచంద్ర నాయక్
6. వైరా – రాందాస్
7. ఇల్లందు – కోరం కనకయ్య
8. సత్తుపల్లి – మట్టా రాగమయి
9. అశ్వారావుపేట – ఆదినారాయణ
10. వనపర్తి – మేఘారెడ్డి
11. బోథ్ – గజేందర్
12. జుక్కల్- లక్ష్మీ కాంతారావు
13. కరీంనగర్ – పరుమళ్ల శ్రీనివాస్
14. సిరిసిల్ల – మహేందర్ రెడ్డి
15. నారాయణ ఖేడ్ – సురేష్ షెట్కర్
16. పఠాన్ చెరు – నీలం మధు.