- ఈ నెల 15 నుండి 23 వరకు శ్రీ దేవి నవరాత్రోత్సవాలు
- ప్రతి రోజు రాత్రి 9 గం.ల నుండి దాండియా
- ఈనెల 20న అమ్మవారి పల్లకి సేవ
- 22న సద్దుల బతుకమ్మ, 23న విజయదశమి
- ప్రతిరోజు సాయంత్రము శ్రీమద్భాగవత ప్రవచనం
కరీంనగర్ లోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు కోసం శ్రీ మహాశక్తి దేవాలయంతో పాటు ఆలయ పరిసరాల వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నయి. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో ఈనెల 15 నుండి ప్రారంభమవుతున్న దేవీ నవరాత్రోత్సవాలను 23 తేదీ వరకు కన్నుల పండుగగా, ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణాన్ని, ఆలయానికి వచ్చే రహదారులను ఆకర్షణీయమైన విద్యుద్దీపాలతో ముస్తాబు చేస్తున్నారు.
కార్యక్రమ వివరాలు:
🔸15వ తేదీ, ఆదివారం ఉదయం 8 గం.లకు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారం – పూజ. స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, అమ్మవారికి ప్రతిరోజూ చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం. సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేక కార్యక్రమాలు.
🔸16 తేదీ, సోమవారం ఉదయం 8 గం.లకు శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం – పూజ మరియు అమ్మవారికి పూలతో అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు లింగార్చన.
🔸17 తేదీ, మంగళవారం రోజున ఉదయం 8 గం.లకు శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం – పూజ మరియు అమ్మవారికి శాకాంబరీ అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు సుహాసినులచే సామూహిక కుంకుమ పూజలు, కేబీ శర్మ బృందంతో భక్తి సంగీత విభావరి.
🔸18 తేదీ, బుధవారం రోజున ఉదయం 8 గం.లకు శ్రీ మహాలక్ష్మి దేవి (కూష్మాండ ) అవతారం – పూజ మరియు చీరలతో అలంకరణ. సాయంత్రం 6 గం.లకు సౌందర్య లహరి, కనకధార స్తోత్ర పారాయణం.
🔸19 తేదీ, గురువారం రోజున శ్రీ మహాచండీ దేవి (స్కంద మాత) అవతారం – పూజ మరియు పండ్లతో అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు చందనాభిషేకం.
🔸20 తేదీ శుక్రవారం రోజున మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి (కాత్యాయని) అవతారం – పూజ.
సాయంత్రం 6 గం.లకు విద్యార్థులచే సరస్వతీ పూజ, పల్లకి సేవ, శ్రీ రతన్ కుమార్ శిష్య బృందంచే శాస్త్రీయ ఆలయ నృత్యాలు.
🔸21 తేదీ శనివారం రోజున 8 గం.లకు శ్రీ లలితాదేవి (కాళరాత్రి) అవతారం – పూజ మరియు గాజులతో అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు లలితా సహస్రనామ పారాయణం.
🔸22వ తేదీ ఆదివారం రోజున దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ) అవతారం – పూజ, రుద్రసహిత చండీ హోమం.
సాయంత్రం 6 గం.లకు అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు,
🔸23 తేదీ సోమవారం రోజున విజయదశమి, ఉదయం 8 గం.లకు, మహిషాసురమర్ధిని దేవి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవి (సిద్ధి రాత్రి) అవతారం – పూజ, శమీ పూజ,
ఉదయం 7 గం.ల నుండి వాహనపూజలు
సాయంత్రం 6 గం.లకు మహిషాసురమర్ధిని పూజ.
దేవీ నవరాత్రులలో ప్రతిరోజు సాయంత్రం 7 గం.ల నుండి బ్రహ్మశ్రీ డా.గర్రెపల్లి మహేశ్వర శర్మ గారిచే శ్రీమద్భాగవతం లోని వివిధ ఘట్టములపై ప్రవచన కార్యక్రమం మరియు ప్రతిరోజు రాత్రి 9 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు.
అమ్మవారి మాలాధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చె అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దర్శనం సర్వ కష్ట నివారణం, మహాపుణ్యదాయకం అయినందున సమస్త హిందూ బంధువులందరూ నవరాత్రి ఉత్సవాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొని జగదాంబ మూర్తుల కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.