A place where you need to follow for what happening in world cup

మహిళా జర్నలిస్టుపైకి కుక్కలను వదిలిన ఒడిశా మాజీ మంత్రి

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఓ మహిళా జర్నలిస్టుపై మాజీ మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు. దీంతో జర్నలిస్టుతో పాటు కెమెరామ్యాన్ కు గాయాలయ్యాయి. రఘునందన్ దాస్ పై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబీ దాస్ గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా జరిగిందీ ఘటన. ఈ అమానుషంపై జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. రఘునందన్ దాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
బీజేడీ నేత బాబీ దాస్ 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అతడికి ప్రభుత్వం భువనేశ్వర్ లో అధికారిక క్వార్టర్స్ కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన బిల్డింగ్ తో పాటు పక్కనే ఉన్న మరో మూడు క్వార్టర్లను కూడా బాబీ దాస్ ఆక్రమించారు. వాటన్నింటినీ కలిపి ఒక్కటిగా మార్చడంతో పాటు నాలుగు అంతస్తుల ప్రైవేట్ బిల్డింగ్ ను నిర్మించుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో బాబీ దాస్ ఓటమి పాలయ్యారు. దీంతో అధికారిక భవనం ఖాళీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే తను అక్రమంగా కట్టుకున్న నిర్మాణాన్ని గుట్టుచప్పుడు కాకుండా బాబీ దాస్ కూల్చివేస్తున్నాడు.

ఈ విషయం తెలిసి స్థానిక మహిళా జర్నలిస్టు చిన్మయి న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్లారు. బాబీ దాస్ నివాసం పక్కనే ఉన్న మాజీ మంత్రి రఘునందన్ దాస్ అధికారిక నివాసంలో నుంచి వీడియోలతో న్యూస్ కవర్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రఘునందన్ దాస్.. చిన్మయి పైకి తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పి దాడి చేశాడు. ఈ ఘటనపై జర్నలిస్టుల ఫిర్యాదుతో రఘునందన్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.