ఓటరు జాబితా పరిశీలకురాలు కె. నిర్మల:
జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితా కీలకమని ఓటరు జాబితా పరిశీలకురాలు కె. నిర్మల సూచించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఈ.ఆర్.ఓ, ఏ. ఈ. ఆర్.ఓ లతో ఆమె సమావేశమై జిల్లాలో ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు చేర్పుల దరఖాస్తులపై నాలుగు నియోజక వర్గాలలోని మండలాల వారీగా జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావుతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎక్కడకూడా ఎలాంటి పొరపాట్లు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. చనిపోయిన వారి దరఖాస్తులకు సంభందించిన ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలగా పరిశీలించుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాకు సంబంధించిన అన్ని రికార్డులను తప్పక నిర్వహించాలని అన్నారు. జిల్లాలో అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు.
అనంతరం జిల్లా ఎన్నికల అధికారి యస్. వెంకట్రావ్ మాట్లాడుతూ ఫామ్ 6,7,8 దరఖాస్తులకు సంబంధించి మిగిలిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఫామ్ 6 ద్వారా 36247 దరఖాస్తులు అందాయని 33882 పరిశీలించమని మిగిలినవి పరిశీలన చేసి ఆమోదించనున్నట్లు తెలిపారు. అలాగే ఫామ్ 7 ద్వారా 22774 దరఖాస్తులు అందగా 13032 ఆమోదించాని మిగిలిన దరఖాస్తులను పరిశీలన చేసి ఆమోదించడం జరుగుతుందని అదేవిదంగా ఫామ్ 8 ద్వారా 15842 దరఖాస్తులు అందగా 13698 ఆమోదించడం జరిగిందని మిగిలిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే ఆమోదించడం జరుగుతుందని వివరించారు. తుది ఓటరు జాబితాకు ఎలాంటి పొరపాట్లు లేకుండా తిరిగి పరిశీలించుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి, ఆర్.డి.ఓ లు కోదాడ సూర్యనారాయణ, జగదీశ్వర్ రెడ్డి, తహశీల్దార్లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.