- ఏ వెలుగుల కోసం ఈ ఇసుక తవ్వకాలు
- ఇదేనా బ్యారేజీల సార్థకత
- రైతుల ప్రయోజనాలు పట్టించుకోరా
- పర్యావరణం భూగర్భ జలాల మాటేమిటి
- సుప్రీం తీర్పు వచ్చే వరకూ ఆగని వైనం
- రైతును విడిచి సాము చేస్తున్న సర్కార్
ఇసుక తుఫాన్ 5
కాళేశ్వరం బ్యారేజీలను ఇసుక గనులుగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న హడావుడిపై తీర ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, మానేరు నదులను ఇసుక కయ్యలుగా మారిస్తే జరిగే పర్యావరణ విధ్వంసం గురించి వారు కలత చెందుతున్నారు. ఎటువంటి అధ్యయనం చేయకుండా వేల కోట్ల రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల వెనుక కొందరు ఉన్నతాధికారుల అత్యుత్సాహమే కారణమని తెలుస్తున్నది.
బ్యారేజీల వెనుక భాగంలో విచక్షణా రహితంగా ఇసుక తీస్తే గోదావరి, మానేరు నదుల ఉనికికే ప్రమాదమని నీటిపారుదల శాఖకు చెందిన కొందరు ఇంజినీర్లు చెప్పినా వారి మాటను పట్టించుకునే వారు లేక పోవడం విశేషం. నదీ ప్రవాహపు గమనాన్ని నిర్దేశించడంలోనూ, చేపలు, పక్షులు, తదితర జీవరాసుల మనుగడకు, భూగర్భ జలాలు పెరగడానికి ఇసుక అవసరమని భూగర్భ నిపుణలు చెప్తున్నమాటలు కొందరు బ్యూరోకాట్ల చెవికి వినిపించడం లేదని అర్థమవుతోంది.
ఆదాయం రెట్టింపు చేస్తానని మైనింగ్ అధికారి హామీ
గత ప్రభుత్వంలో సింగరేణి ఉన్నతాధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన రీతిలో ఆదాయం రాక పోవడాన్ని ఆ శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పలు సమీక్షా సమావేశాల్లో ప్రస్తావించారు. గ్రానైట్ తదితర విలువైన ఖనిజాలను అక్రమ రవాణా చేస్తూ రాయల్టీ కట్టకుండా తప్పించుకుంటున్న పలువురు ప్రముఖులపై చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం ఈ దిశలో ఆలోచించకుండా దృష్టినంతా ఇసుకపైనే కేంద్రీకరించింది. ఇసుక అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఉన్నతాధికారి సీఎంకి చెప్పనట్లు తెలిసింది. ఇప్పుడు ఆయన ఈ దిశగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. భూపాలపల్లి నుంచి భద్రాచలం వరకూ 200 కిలోమీటర్ల దూరం గోదావరి నది ప్రవహిస్తున్నది.
ఈ ప్రాంతంలో ఇసుక పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ ఈ ప్రాంతమంతా ఏజెన్సీలో ఉండడంతో పీసా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాలను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించవలసి ఉంది. ఆదాయంలో సగ భాగం సంఘాలకు చెల్లించవలసి ఉంటుంది. దీనికి తోడు పర్యావరణ అనుమతులు రావడంతో జాప్యం జరుగుతున్నది. ఏజెన్సీలో ఇసుక రీచ్ లను ప్రారంభిస్తే ప్రజలకు మేలు జరుగుతుందే తప్ప ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెద్దగా రాదు. పర్యావరణ అనుమతుల ప్రకారం మాన్యువల్ మైనింగ్ చేయవలసి ఉంది. యంత్రాలు వినియోగించక పోతే ఆశించిన మేరకు ఇసుకను తీయలేరు. ఇది వర్క్అవుట్ కాదని భావించిన అధికారుల కన్ను ఖాళీగా ఉన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పడింది.
ఎన్డీఎస్ఏ ఏమిచెప్పింది
సాంకేతిక కారణాలతో నిరుపయోగంగా మారిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రెండు సార్లు పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. మరమ్మత్తులు పూర్తయ్యే వరకూ నీటిని నింపవద్దని సూచించింది. అన్నారం బ్యారీజీ ముందు భాగంలో గేట్ల వద్ద పేరుకుపోయిన ఇసుకను తొలగించాలని తెలిపింది. ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగా బ్యారేజీ గేట్ల వద్ద ఇసుక తొలగించకుండా ఎగువ భాగంలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఇసుక తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది.
7. In case of Annaram barrage,the sand heaps accumulated in front of the barrage bay raft shall be suitably removed and the waterway cleared strictly adhering to the norms of I & CAD Department or other regulations in this regard for removal of sand from the river.
గోదావరిలో పై భాగంలో మరో ఆరు కిలోమీటర్ల దూరంలో మానేరు నదిపై కూడా ఇసుక రీచ్ లను గుర్తించింది. రెండు నదుల్లో ఇసుక తీయడం ద్వారా రూ. 1,300 కోట్లు ఆదాయం వస్తుందని టీజీఎండీసీ అంచనా వేసింది. బ్యారేజీని వినియోగంలోకి తీసుకురాకుండా ఇసుక ఆదాయం కోసం వెంపర్లాడడం విశేషం.
అధికారులపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద ఇసుక రీచ్ లను వెంటనే ప్రారంభించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి అధికారులపై ఒత్తిడి పెంచుతున్నది. ఇసుక తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ శాఖ జారీ చేసిన జీవోలు 38, 3, 54 ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఇసుక తవ్వకాల కోసం అనుమతులను జారీ చేయాలని మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవల భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సర్వే పూర్తి చేసి సాంకేతిక అనుమతులను ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఇసుక మేటలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా సాంకేతిక అనుమతులను ఇవ్వలేమని నీటిపారుదల శాఖకు చెందిన అన్నారం బ్యారేజీ ఎక్సికూటివ్ ఇంజనీర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఈ లేఖతో ఖంగుతిన్న రాష్ట్ర మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి హైదరాబాద్ లో సమావేశమై ప్రయివేటు ఏజెన్సీ సహకారంతో లైడార్ డ్రోన్ సర్వే చేయించారు. ఈ సర్వేలో టీజీఎండీసీ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం గోదావరి, మానేరు తీర ప్రాంత గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణం తర్వాత గోదావరి, మానేరు తీరంలో భూగర్భ జలాలు 27 మీటర్లు పైకి వచ్చాయి. కేవలం 10 మీటర్ల లోతులో నీరు పుష్కలంగా లభించేది. గత రెండు సంవత్సరాలుగా బ్యారేజీలు నింపక పోవడంతో భూగర్భ జల మట్టం 37 అడుగుల లోతుకు పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు నదుల్లో భారీగా ఇసుకను తీస్తే భూగర్భ జలాలు మరింత అడుగంటి పోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు.
‘సుప్రీం’ కేసు తెలకముందే..
మానేరు నదిలో ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని పెద్దపల్లి జిల్లాకు చెందిన తీర ప్రాంత రైతులు గతంలో ఎన్జీటీనీ ఆశ్రయించారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ స్టే విధించింది. దీనిని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయగా ఎన్జీటీ ఆదేశాలను హై కోర్టు కూడా సమర్థించింది. అంతటితో వదలకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఖనిజాభివృద్ధి సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులపై రైతులు కౌంటర్ వేశారు. పూర్తి స్థాయి జడ్జిమెంట్ రాక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు మళ్ళీ శ్రీకారం చుట్టింది. ఇసుక కోసం ప్రజలపై ప్రభుత్వమే న్యాయ పోరాటం చేస్తున్నది.