కాంగ్రెస్లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి
కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా..ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా..శనివారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరికలు ఇంతటితో ఆగేటట్టు కనిపించడం లేదు. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అరికెపూడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే… కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అరికెపూడి గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అలాగే ఆదివారంఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కాగా అరికెపూడి చేరికతో హస్తం పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్లో బీఆర్ఎస్ కార్పొటర్ల సంఖ్య 56 నుంచి 41 కి చేరింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ప్రస్తుతం కాంగ్రెస్ కార్పొరేటర్లు సంఖ్య 3 నుంచి 25కు చేరింది. బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య 39కి చేరింది.