9 వరకు నామినేషన్ల స్వీకరణ…27న పోలింగ్…జూన్ 5న కౌంటింగ్
గురువారం వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13 వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5న వోట్లు లెక్కించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. కాగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు వోటర్లుగా నమోదయ్యారు. ఈ ఉప ఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.