సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని కెసిఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు
కిషన్ రెడ్డి గెలిచినా చేసిందేవి లేదు
హైదరాబాద్కు వరదలొస్తే కనపడని కేంద్ర మంత్రి
దానం గెలుపు…కేంద్రంలో మంత్రి అవడం ఖాయం
సికింద్రాబాద్ ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దేనని, మత సామరస్యాన్ని కాపాడింది తమ పార్టీనని, భారాసకు వోటేస్తే మూసీ కాలువలో వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలని, దేవుడిని ప్రధాని మోదీ బజారులోకి తీసుకొచ్చారని, మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని భాజపా చూస్తుందని రేవంత్రెడ్డి విమర్శించారు. బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్…సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలిస్తే కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వొస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో కీలక పదవి ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. భారాస అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ..కేసీఆర్ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టేనని, పరువు తీయడానికే అతడిని సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారని, పద్మారావు నామినేషన్కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదన్నారు. ఆయనకు వాళ్లు మద్దతు ఇవ్వడం లేదని, సికింద్రాబాద్ టికెట్ను భాజపాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదల్లో మునిగితే కిషన్ రెడ్డి ఎక్కడికి పోయారని అన్నారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి పైసా వరద సాయం తేలేదన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..గ్రేటర్ సిటీకి మెట్రో, కృష్ణా గోదావరి నీటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. కేసీఆర్ సికింద్రాబాద్ టికెట్ను బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ పద్మారావును ఓడించి కవితకు బెయిల్ తెచ్చుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్కు వోటేస్తే బీజేపీకి లాభం జరుగుతుందన్నారు. బస్తీలు బాగుపడాలంటే కాంగ్రెస్కు వోటెయ్యాలని చెప్పారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు వోటేస్తే మూసీ మురికి వాడలో వేసినట్లేనని విమర్శించారు. నిరుద్యోగులను, రైతులను ప్రధాని మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏటా 20 లక్షల జాబ్లు ఏమయ్యాయని బీజేపీని ప్రశ్నించారు.
ఓటమి భయంతో మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మతసామరస్యం వెల్లివిరిసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే మతసామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సికింద్రబాద్లో దానం నాగేందర్ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో అంజన్ కుమార్ యాదవ్, నాగేందర్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.