ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి..
ఇండియా కూటమి విజయం
సిఎం రేవంత్ రెడ్డి జోస్యం
దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు 2024లో వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేస్తుందని అన్నారు. అప్పుడు వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ పాలనను సోనియా గాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితి పునరావృతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటిలాగే వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీని తిరస్కరించి…రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపిస్తారని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈసారి బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు ఇచ్చిన చెక్కులా ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.