A place where you need to follow for what happening in world cup

బిఆర్‌ఎస్‌కు మరో నేత రాజీనామా

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌
సిఎం రేవంత్‌ సమక్షంలో చేరిక

సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. మంత్రి సీతక్క అధ్వర్యంలో ఇటివలే సిర్పూర్‌ (టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే తరహాలో జిల్లాలో వివిధ పార్టీల నాయకులు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, మున్సిపల్‌ చైర్మన్‌ లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మంత్రి సీతక్క ఆధ్వర్యంలో చేరికల పరంపర పెరిగింది. బోథ్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ తాజాగా సోమవారం సిఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో బోథ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగిన బాపురావ్‌ ముందుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరి వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆ తరువాత ఎంపి టికెట్‌ కోసం ప్రయత్నం చేశారు. ఎంపి టికెట్‌ సైతం గోడం నగేష్‌ కు కేటాయించడంతో బిజెపిలో ఎలాంటి ఆదరణ లేకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు.

మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోథ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ ఆడే గజేందర్‌, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు కుచాడి శ్రీహరిరావ్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ సైతం సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికలు సవ్నిపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగడంతో పార్టీలో మంచి జోష్‌ కనిపిస్తుంది.

అనుకున్న స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపొందే దిశగా కాంగ్రెస్‌ పావులు కదుపుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మంత్రి సీతక్క చక్రం తిప్పుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఢీ కొట్టడానికి, ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్‌ ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతు కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు చేపడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌ రెడ్డిలు సైతం నేడో రేపు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.