A place where you need to follow for what happening in world cup

ఇక విశాఖకు మహార్దశ

విశాఖపట్టణం, ఆగస్టు1:విశాఖతోపాటు ఉత్తరాంధ్ర రూపు రేఖలు మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు సీఎం జగన్. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేసిన ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు.సౌతిండియాలోనే అతి పెద్ద మాల్ విశాఖలో రాబోతుందన్నారు సీఎం జగన్. ఇది పూర్తై 8వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. విశాఖలోనే ఇంటర్‌నేషనల్‌ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ లైవ్‌లోకి వస్తే విశాఖతోపాటు ఉత్తారంధ్ర రూపు రేఖలే పూర్తిగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. విశాఖలోని కైలాసపురం వద్ద ఇనార్బిట్‌ మాల్‌కు భూమి పూజలు చేసారు. ఇనార్బిట్‌ మాల్‌ను 15 ఎకరాల్లో ఆరువందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్ విశాఖ చేపట్టే మరో 136 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేశారు. కైలాసపురంలో ఏర్పాటు చేయబోతున్న ఇనార్బిట్‌ మాల్‌ను కె. రహేజా గ్రూపు అభివృద్ధి చేయనుంది.

2026 నాటికి ఈ మాల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మాల్‌ కోసం పోర్టుకు చెందిన భూమిని 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అదే కంపెనీ హిందూపురంలో కూడా ఎలక్ట్రానిక్, టెక్స్‌టైల్ పార్క్‌ ఏర్పాటు చేయబోతుందని సీఎం జగన్ తెలిపారు. విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌ (ఏ హబ్‌)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్‌ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు.

విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్‌ సెంటర్‌తోపాటు ఎనెక్స్‌ సెంటర్స్, ప్రోటోటైపింగ్‌/మేకర్స్‌ ల్యాబ్, స్టూడెంట్‌ ఐడియేషన్‌ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌ను సీఎం ప్రారంభించారు.డిజిటల్‌ క్లాసులు, డిజిటల్‌ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్‌ పేరుతో ఏయూ డిజిటల్‌ జోన్‌ అండ్‌ స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్‌ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్‌ ఫార్మింగ్, ప్రాసెసింగ్‌ ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా కల్చర్‌ స్కిల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ హబ్‌ను నెలకొల్పారు. వీటిని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. నూతన భవనాల ద్వారా 2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద ఇంక్యుబేటర్‌ హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్‌ మార్క్స్‌ను నమోదు చేస్తుందని అంచనా. ఈ హబ్స్‌ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది.

Leave A Reply

Your email address will not be published.