సెప్టెంబర్ రెండవ వారానికల్లా పూర్తి
కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి సమీక్ష
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు(హెచ్ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి, సెప్టెంబర్ రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ…ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదని, ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివిధ దశలలో పెండింగ్లో ఉన్న భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
భూసేరణ నష్ట పరిహారనికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయ పరమైన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్ రాజు, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవిన్ మిట్టల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్&బి శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్లొన్నారు.