సహజ కవి అందెశ్రీ దంపతులను సత్కరించుకోవడం జీవితంలో గుర్తుండిపోయే సందర్భం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అందెశ్రీ తెలంగాణ గర్వించదగ్గ కవి గాయక వైతాళికుడని, సహజ కవి అయిన ఆయనను సత్కరించు కోవడం తన జీవితంలో మరిచిపోలేని సందర్భమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డిని ఆదివారం ఆయన నివాసంలో అందెశ్రీ దంపతులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… అందెశ్రీ హృదయాంత రాళం నుండి ఉద్భవించిన ‘‘జయ జయహే తెలంగాణ..’’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ఇటీవల ప్రజా ప్రభుత్వం నిర్ణయించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో భాగమని అన్నారు. సిఎం ఇంకా తనను కలిసిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్(డప్పు వాయిద్యం), పేరిణి రాజ్ కుమార్ నాయక్(పేరిణి నృత్యం)లను అభినందించారు.