ఆచారం చెప్పిన హరిదాసు అదే కూటికి ఎగబడినట్లు, సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ అయింది, ఇప్పటికే అన్ని పార్టీల టికెట్ ఖరారైంది. వైఎస్ఆర్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయిస్తే , కేవలం రెండు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం ముప్పై శాతం పైగా సీట్లు కేటాయించారు. డా బి ఆర్ అంబెడ్కర్ పుణ్యమా అని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గం వారికి టికెట్లు ఇచ్చారు. శ్లేష్మంలో పడ్డ ఈగలాగా వెనుకబడిన కులాలు, కాపులు, మైనారిటీల పరిస్థితి. దేశ వ్యాప్తంగా సామాజిక కుల గణన అనేది చేపడితే ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో తెలుస్తుంది. ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి ఓబీసీలను, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఒకరంటే, బీసీ కులాలంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు బ్యాక్ బోన్ కమ్యూనిటీ అని ఇంకొకరు. ఓబిసిలల్లో రాజకీయ చైతన్యం లేకపోవడం ఉత్పత్తి కులాల వారు పలు విధాలుగా చీలిక పేలికలై ఉండటం సంఘటితంగా లేకపోవడం, ఆర్థికంగా సామాజికంగా బలంగా లేకపోవడం లాంటి బలహీనతలు అగ్రవర్ణాలకు బలంగా మారాయి.
రాష్ట్రంలో నిరుద్యోగం, ఉపాధి లేక యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ప్రయివేటు కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ విద్యా వ్యాపారాన్ని పోషిస్తూ బహుజనులకు విద్యను దూరం చేసి సర్వనాశనం చేశారు. సామాజిక చలనశీలత , సామూహిక సమీకరణ, సామాజిక ఉద్యమాల ప్రక్రియలు ముఖ్యమైన కొనసాగింపు అనుసంధానంతో సామాజిక పురోగతి సాధ్యపడుతుంది. కొన్ని సమయాల్లో, ఈ ప్రక్రియల్లో ఒకటి మరొకటి పొడిగింపుగా మారుతుంది లేదా మరొక దాని ఆవిర్భావానికి మార్గం సుగమం చేస్తుంది. సామాజిక పురోగతి యొక్క ప్రతిబింబ నిరంతర ప్రపంచీకరణ పెరుగుతున్న సామాజిక – సాంస్కృతిక విచ్ఛిత్తి నేపథ్యంలో భారతదేశంలో గ్రామీణ సమాజం సామాజిక చలనశీలత విభజన , మినహాయింపు ఆధిపత్యం , కొత్త ఆసక్తులు గుర్తింపుల ఉచ్చారణలు , సంఘర్షణలు, ప్రతిఘటన సామూహిక సమీకరణ అట్టడుగు మూలాల్లో సామాజిక ఉద్యమాల యొక్క కొత్త రూపాల యొక్క అభివ్యక్తి. కమ్మ, రెడ్డి కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలమైనవి. ఐదు శాతం లోపు జనాభా ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకుని, మిగిలిన సామాజిక వర్గాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నాయనేది వాస్తవం. బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీలు, మైనారిటీ వర్గాలన్నీ తమ పల్లకీలు మోయడానికే ఉన్నట్టు అహంకారపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే సామజిక సమగ్రత దూరమవుతున్నారనేది వాస్తవం.
శాంతియుత వాతావరణంలో బతుకుతున్న రాష్ట్ర ప్రజలను మత, కుల గజ్జి కొలిమిలో లాగాలనే కుట్రలు జోరందుకున్నాయి. అధికారమే పరమావధిగా ప్రజలను వేరే చేసేందుకు విభజన రాజకీయాలు పాల్పడుతున్నారు. ఎలాగైనా సరే అధికార పీఠాన్ని అధిరోహించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు చైతన్యంతో ఏకతాటిపై నడవాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పూర్తి నిర్లక్ష్య ధోరణి లో ఉంది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన అజెండాను అమలు చేయడానికి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోంది. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పేదరికం పెరిగిపోయింది. తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ అట్టడుగు స్థానానికి పడిపోయింది. దీనికి కారణం ఇప్పటికే మద్యం రేట్లు పెంచి లక్ష కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మి పేద, మధ్యతరగతి జేబులు ఖాళీ చేశారు. పన్నులు, ధరలు, ఛార్జీలు పెంచి ప్రజల సంపాదన గుంజుకున్నారు. రైతులకు గిట్టాబాటు ధరలు కల్పించలేదు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో రాష్ట్రం నిలిచింది.
2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.47 వేల కోట్లు దారి మళ్లించారు. పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో పేదరికం తారాస్థాయికి పెరిగింది. పేదిరకం లేని సమాజాన్ని స్థాపించాలన్న ఆశయానికి జగన్ రెడ్డి గండికొట్టారు. జగన్ రెడ్డిని గద్దె దింపి పేదరికం లేని సమాజం, ఆర్థిక అంతరాలు తగ్గించే పరిపాలన అందించడమే. ఎంతో ఆర్భాటంగా బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి నాలుగు సంవత్సరాలవుతుంది. మొత్తం 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు సృష్టించి 728 చైర్మన్, డైరెక్టర్ల పదవులను ఎవరి కుల పరిధిలో వారికి ఇవ్వడం జరిగింది . బీసీ కులాల అభివృద్ధికి పాటు పడుతున్నామని ప్రకటన గుప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణలో ఈ కులాల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతులను ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో అభివృద్ధి చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరిస్తోంది.
సమాజం ఎప్పటికప్పుడు మారుతుంది. ప్రజల్లో కూడా దానికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో మెకనైజేషన్ పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవసాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు.. చేతివృత్తులు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధారపడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ-కార్పొరేటీకరణ దక్కాలి. కానీ ప్రస్తుతం వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్-, ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు తమ వృత్తులను కోల్పోయాయి. ప్లాస్టిక్ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్ తో వడ్డెర బతుకులు ఆగమై కూలీలుగా మారారు.
ట్రాక్టర్లు… సా మిల్లులు రావడంతో వడ్రంగి, కమ్మరి పని దెబ్బతింది. డ్రై క్లీనింగ్ షాపులు వల్ల చాకలి, నేత మిల్లులు రావడంతో నేత వృత్తి, బ్యూటీపార్లర్లు, హేర్ కటింగ్ సెలూన్ల రాకతో మంగళి, రెడీమేడ్ దుస్తులతో దర్జీలు, జ్యూయలరీ షాపులతో విశ్వ బ్రాహ్మణుల వృత్తులు దెబ్బతిన్నాయి. నాలుగేళ్లుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల సమస్యలపై అవగాహన ఉన్న వారు తమకు కావలిసిన పథకాలను డిజైన్ చేయగలరు, కానీ కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్న వారికి ఇచ్చారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన స్పందించడం లేదు. కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కింది స్థాయిలో అర్థం చేసుకుని పరిష్కరించే అవకాశం కలుగుతుంది. బహుజనులు మైనారిటీలు కలిసికట్టుగా సంఘటితమై ఈ జాతి రాజ్యాంగ విలువలు, ధర్మాలు పరిరక్షించేందుకు, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలి.
-డా. ముచ్చుకోట సురేష్బాబు,
అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక