మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం
బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీకి తాకట్టుఅ మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా డమ్మీ
త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు
ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ
సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర
వారిని తొక్కుకుంటూ వెళ్లి మరీ పథకాల అమలు
మేడ్చల్ జన జాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అత్యధిక మెజార్టీతో సునీతమ్మను గెలిపించాలని విజ్ఞప్తి
హిందువుల ఆస్తులను ముస్లిమ్లకు రాసి ఇస్తారని ప్రధాని మాట్లాడటం సరికాదని, ఎలా రాసి ఇస్తారంటూ దుయ్యబట్టారు. అంబేడ్కర్ రాజ్యాంగంపైన ప్రమాణం చేసి మోదీ ఇలా మట్లాడుతావా..అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టి గెలవడానికి ప్రయత్నిస్తుంటే కమ్యూనిస్టుగా చెప్పుకునే వాడివి వోట్లు ఎలా అడుగుతావని ఈటలను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వొచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ప్రధాని మోదీతో కేసీఆర్ చికటి ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల మనోభావాలను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని, అందుకే ఆ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్కు వోటు వేయాలని కోరారు. ప్రజలు బీఆర్ఎస్కు వోటు వేస్తే మూసిలో వేసినట్లవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ జన జాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ..పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా తనను కార్య కర్తలే ముందుండి గెలిపించారని తెలిపారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం అనేక ప్రయత్నా లు చేశానని, కొన్ని సమస్యలను పరిష్కరించగలిగానని చెప్పారు.
ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పరాయి వాళ్ల చేతిలో ఉన్నాయని, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వాళ్లు ఎంపీగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డిని పోటీ చేయాల్సింది కానీ, తానే అధిష్టానాన్ని ఒప్పించి మల్కాజ్ గిరి నుంచి బరిలో దింపానని తెలిపారు. మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సుపరిచితులని అన్నారు. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీని గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందులో మల్కాజ్ గిరి సీటు కూడా ఉందన్నారు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థిగా డమ్మినీ పెట్టారని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ బీఆర్ఎస్ను మోదీకి తాకట్టు పెట్టారని, అందుకే మోదీ, కేసీఆర్ ఇద్దరిని ఓడిరచాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను బొందపెట్టారని, అదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో మోదీని కూడా ఓడిరచాలన్నారు. బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఈటల రాజేందర్ కేంద్రం నుంచి హుజూరాబాద్కు నిధులు తీసుకుని వొస్తే అక్కడ ఎందుకు ఆయన ఓడిపోయారని ప్రశ్నించారు.
మోదీ, అమిత్ షా తన చేతుల్లో ఉన్నారని ఈటల చెప్పుకుంటున్నారని, అలాగైతే..అమిత్ షాతో చెప్పి కేసీఆర్ అవినీతిని, కాళేశ్వరంపై, హైదరాబాద్ భూములపై, కేటీఆర్ అవినీతిపై ఈటల ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య అండర్స్టాండిరగ్ ఏమిటని నిలదీశారు. ఈటల రాజేందర్ టెలిఫోన్ ట్యాపింగ్ స్పందించడం లేదని, మోదీ ఇచ్చిన హామీలపై చర్చకు ఈటల రాజేందర్ సిద్ధమా..అంటూ రేవంత్ సవాల్ విసిరారు. మోదీ 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి కేవలం 7 లక్షలు మాత్రమే భర్తీ చేశారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి వారి ఆత్మగౌరవాన్ని అదానీ, అంబానీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. లక్షలాది మంది రైతులు కొట్లాడి మోదీ మెడలు వొంచ్చి క్షమాపణలు చెప్పించారని తెలిపారు. కనీస మద్దతు ధర చట్టాన్నిఅమలు చేయకుండా రైతులను ధోకా చేయలేదా..అంటూ రేవంత్ ప్రశ్నించారు. 15 లక్షల నల్లదనం ఖాతాలో వేస్తామని చెప్పి ఒక్క పైసా కూడా మోదీ ఇవ్వలేదని అన్నారు. బీజేపీ నేతలకు దయ్యం పట్టుకుందని, రాముడి పేరు మీద ఎంత కాలం రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలని, తాను హిందువునేనని, దేవుడిని నమ్ముతానని అన్నారు. అందరినీ గౌరవించుకోవడం మన హక్కని, అది రాజ్యాంగం ఇచ్చిన అధికారమని అన్నారు. కమ్యూనిస్టుగా ఈటల రాజేందర్ ముసుగు తొడుక్కున్నాడని, దేవుడిపైన రాజకీయాలను చేసేవారిని పోలిమేర దాటేంత వరకు తరిమికొట్టాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
వివేకంతో వ్యవహరించాలని, వివాదాలతో సంక్షేమాన్ని దెబ్బతీయొద్దని హితువు పలికారు. బీజేపీ పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేయలేదని రేవంత్ దుయ్యబట్టారు. ఆకలి ఇండెక్స్లో భారతదేశం 111 స్థానంలో ఉందని, ఇందుకు మోదీ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రిగా మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, సునీతమ్మను ఎంపీగా గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు తీసుకుశస్తామన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రూ.500లకు సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తున్నామని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ10 లక్షలకు పెంచామని తెలిపారు. అయితే సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వారందరినీ తొక్కుకుంటూ వెళ్లి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు. అత్యధిక మెజార్టీతో సునీతమ్మను గెలిపించాలని,సునీతమ్మకు వేసే వోటు తనకు వేసినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.