నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం
ఎక్స్ వేదికగా హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన
జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యా దివస్’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్ 25వ తేదీని ’రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విషయాన్ని హోమ్ మంత్రి అమిత్ షా ’ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో అత్యయిక స్థితి విధించి ప్రజాస్వామ్యం గొంతు నులిమేసి, ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు.
వి•డియా గళాన్ని అణగదొక్కారు. ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ 25ను ’సంవిధాన్ హత్య దివస్’గా నిర్వహించాలని నిర్ణయించాం. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు అనుభవించిన వేదనను, దాన్ని ఎదిరించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తుచేసుకుందాం‘ అని అమిత్ షా రాసుకొచ్చారు. ఈ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ…నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుందని, దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీ ని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీమ్ కోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆమె ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. అది సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే.
ఆమెను తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాశ్ నారాయణ్(జేపీ) పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, ఆడ్వాణీ, వాజ్పేయీ, మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించగా దేశ ప్రజలు కాంగ్రెస్ను గద్దె దించి జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాగా మారిచ 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు.