- నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీల బదిలీ
- హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లకూ స్థానచలనం
- రవాణా, ఎక్సైజ్ శాఖల కార్యదర్శులకు ట్రాన్స్ఫర్
ఎన్నికల కమిషన్ కొరఢా ఝుళిపించింది. రాష్ట్రంలో పలువురు జిల్లా కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, పోలీస్కమిషనర్ల బదిలీకి ఈసీ ఆదేశించింది. యాదాద్రి, నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, వరుణ్రెడ్డి, హరీశ్, అమయ్ కుమార్ ల బదిలీ, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిజామాబాద్, ఖమ్మం సీపీలు సత్యనారాయణ, విష్ణు ఎస్వారియర్ను బదిలీ చేయాలని బుధవారం ఆదేశించడం కలకలం రేపింది. ట్రాన్స్ ఫర్అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానల్కు పంపాలని ఈసీ తెలిపింది. వీరితో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ముషారఫ్అలీ పారూఖీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టికె శ్రీదేవీలను బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది. అయితే పని అధికారుల పనితీరే ప్రామాణికంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 3 నుంచి 5 వరకు తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ల నిర్వహణపై హైదరాబాద్లో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో పలు ప్రభుత్వ శాఖలతో పాటు పోలీస్ శాఖ సమీక్షలో పలువురు అధికారుల పనితీరుపై ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఎన్నికల కమిషనర్రాజీవ్కుమార్పనితీరుపై సదరు అధికారులను హెచ్చరించారు. పారదర్శకంగా పని చేయాల్సిన అత్యున్నత హోదా కలిగిన అధికారులే పక్షపాతంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ సీఈసీ వారిపై బదిలీ వేటు వేయడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు నేడు 5 గంటల్లోపు ప్యానల్ పంపాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించింది.
బీఆర్ఎస్కు అనుకూలతే కారణమా..?
అధికార బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించడంతోనే ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు కారణమనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు బీఆర్ఎస్పార్టీ, నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఇటీవల హైదరాబాద్కు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ నుంచి ఎంఆర్ఓ వరకు కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ఎన్నికలలో విజయం సాధించే ప్రయత్నంలో తన అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర యంత్రాంగాన్ని, వనరులను వాడుకుంటుందని, అధికారులను పోస్టింగ్, రిటైన్ చేయడానికి తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్నేత బక్క జడ్సన్ఫిర్యాదు చేశారు. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాలు, డీఓపీటీ సర్క్యులర్లు ఉన్నప్పటికీ చాలా మంది అధికారులు ఒకే స్థానంలో ఐదేళ్లకు పైగా విధులు నిర్వర్తిస్తున్నారని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల వాతావరణం నెలకొల్పేందుకు ఆ పార్టీకి అనుకూలంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులందరినీ తక్షణమే బదిలీ చేసి,నాన్ ఫోకల్ ఉద్యోగాలకు పోస్ట్ చేయాలని ఆయన కోరారు.